సంక్రాంతి పండుగ పూట ఘోర విషాదం నెలకొంది. పతంగులు ఎగుర వేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. మంజాను నుంచి బైక్ను తప్పించబోయి ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్లో జరిగింది. అసలేం జరిగిందంటే..
సూరత్కు చెందిన రెహాన్ రహీమ్ షేక్ (35) తన భార్య రెహానా, కుమార్తె ఆయేషా (10)తో కలిసి బుధవారం బైక్పై బయటకు వెళ్లాడు. చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ పతంగి దారం అదేనండీ చైనా మాంజా వారికి అడ్డుగా వచ్చింది. దీంతో అది బైక్కు చుట్టుకుంది. దీంతో రెహాన్ ఒక చేతితో దానిని తొలగించే క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతే.. ముగ్గురూ 70 అడుగుల ఎత్తైన ఆ ఫ్లైఓవర్ నుంచి అమాంతం కిందపడిపోయారు. కింద నిలిపి ఉన్న ఓ ఆటోపై వారు పడ్డారు.
ఈ ప్రమాదంలో రెహాన్, ఆయేషా అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోపై పడిన రెహానా మాత్రం గాయాలతో బయటపడింది. ఆమెకు తీవ్రగాయాలవడంతో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి రెహానా కూడా మరణించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా సంక్రాంతి పండగ రోజుల్లో చైనా మాంజా కారణంగా ఇలాంటి ప్రమాదాలు పరిపాటై పోయాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎందరో మంజా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గాలిపటాల మాంజాను వెంటనే నిషేదించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.
