
హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర సర్కార్ జీఓ కూడా జారీ చేసింది. జవాబుపత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 15తో ముగిసింది. రేపో మాపో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో టెన్త్ మెమోల ముద్రణ ఎలా ఉండాలన్న దానిపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. దీనిపై స్పష్టత వస్తేనే ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ నెలాఖరు నాటికి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. దీంతో మెమోలపై సర్కారు నిర్ణయం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం ఎదురు చూస్తుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే ఫలితాల విడుదల కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి తెలంగాణలో తొలుత పదో తరగతి విద్యార్ధులకు మార్కులనే ప్రకటించే వారు. గతంలో పదో తరగతి మెమోలపై మార్కుల ఆధారంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి, ఫెయిల్ అని కూడా రాసేవారు. దీంతో విద్యార్ధులు అనర్ధాలకు పాల్పడుతున్నారన్న భావనతో ఆ తర్వాత గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ప్రవేశ పెట్టనున్న మార్కుల విధానంలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని ఇచ్చేబదులు పాస్, ఫెయిల్ అని ఇస్తే చాలన్న అభిప్రాయం ఎస్సీఈఆర్టీ వెల్లడించినా.. ఉత్తమ మార్కులు పొందినవారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మెమోలపై ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ అని ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. 35 శాతం మార్కుల కన్నా తగ్గితే మాత్రం ఫెయిల్ అని ముద్రించాలంటూ ప్రభుత్వానికి ఎస్సీఈఆర్టీ ప్రతిపాదించింది.
పరీక్షలు పూర్తై, మూల్యాంకనం ముగిసినా.. నెల రోజులుగా ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. మరోవైపు గ్రేడింగ్ విధానమే కొనసాగించాలని, మార్కులను ప్రవేశపెడితే కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడతాయని, విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని రేవంత్ సర్కార్ 2024 నవంబరులోనే ఎత్తివేసింది. అయితే 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మార్కులను కూడా ఈసారికి కొనసాగించి 2025-26 విద్యా సంవత్సరం నుంచి తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.