
సునీతా విలియమ్స్ భూమ్మీదకు రావడానికి రంగం సిద్ధం అవుతోంది. ఎంతోమంది, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టైమ్ దగ్గరకు రానే వచ్చింది.. మరికొన్ని రోజుల్లో సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు ల్యాండ్ కాబోతున్నారు. సునీతతోపాటు బుచ్ ను తిరిగి భూమ్మీదకు తీసుకురావడానికి నాసా-స్పేస్ ఎక్స్ క్రూ-10 మిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.. తాజాగా.. క్రూ-10 బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ బృందాన్ని నలుగురు వ్యోమగాముల బృందం కలుసుకుంది.. డాకింగ్, హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియ విజయవంతం అయినట్లు నాసా తెలిపింది. డ్రాగన్ క్యాప్సూల్లో ప్రయాణించి అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన వ్యోమగాములకు.. సునీతా విలియమ్స్ బృందం స్వాగతం పలికింది.. ప్రస్తుతం ISSలో మొత్తం 11 మంది వ్యోమగాములు ఉన్నారు.. హ్యాండోవర్ ప్రక్రియ రెండురోజుల పాటు సాగనున్నట్లు నాసా తెలిపింది. హ్యాండోవర్ ప్రక్రియ తర్వాత భూమికి సునీతా, విల్మోర్ రానున్నారు.
కాగా.. 2024 జూన్ లో సునీత, బుచ్ 8 రోజుల మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు.. అయితే.. ఆరుగురితో కూడిన సునీత బృందం తిరిగి వస్తున్నప్పుడు, స్టార్లైనర్ అంతరిక్ష నౌక థ్రస్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్పటి నుండి, ఇద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. దాదాపు 9 నెలలు అయ్యింది. అయితే.. సునీతా విలియమ్స్ – బుచ్ విల్మోర్ ను తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి NASA-SpaceX శుక్రవారం క్రూ-10 మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ముందుగా ఈ మిషన్ బుధవారం ప్రారంభించారు.. కానీ వ్యవస్థలో కొంత సమస్య కారణంగా దాని ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. శుక్రవారం దీనిని విజయవంతంగా ప్రయోగించారు. సునీత-బుచ్ భూమికి తిరిగి రావడం కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది.
వీడియో చూడండి..
VIDEO | Crew-10 team – which includes NASA’s Anne McClain and Nichole Ayers, Japan Aerospace Exploration Agency’s Takuya Onishi and Roscosmos cosmonaut Kirill Peskov – arrives at International Space Station. The Crew-10 team will replace astronauts Sunita Williams and Barry… pic.twitter.com/sHr0FXmZIA
— Press Trust of India (@PTI_News) March 16, 2025
తొమ్మిదినెలలుగా ISSలో సునీతా, విల్మోర్తోపాటు వ్యోమగాములు నిక్ హేగ్, డాన్ పెటిట్, గోర్బునోవ్, అలెక్సీ ఓవ్చినన్ ఉన్నారు. అంతా సవ్యంగా జరిగితే.. ఈనెల 19న అంతరిక్షం నుంచి భూమ్మీదకు రానుంది సునీతా బృందం. అయితే.. మిషన్కు క్రూ-10 లో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. ISS కు చేరుకున్న మిషన్ క్రూ-10 బృందంలోని సభ్యులలో NASA అన్నే మెక్క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. అయితే.. అంతరిక్షంలో ఎక్కువ కాలం నిరంతరంగా ఉన్న మొదటి మహిళగా సునీత నిలిచారు.. నాసా – స్పేస్ఎక్స్ సంయుక్తంగా వారిని తీసుకువచ్చే మిషన్ను నిర్వహిస్తున్నారు.
ఆ వ్యోమగాముల పరిస్థితి ఏంటి?
ఇదిలాఉంటే.. గురుత్వాకర్షణ ఏమాత్రం లేని అంతరిక్షంలో తొమ్మిదినెలలు గడిపి, తిరిగి భూమ్మీదకు వచ్చిన తర్వాత, ఆ వ్యోమగాముల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా వ్యోమగాముల పాదాలు చిన్నారుల పాదాల్లా అత్యంత సున్నితంగా మారతాయి. దీన్నే “బేబీ ఫీట్” అని పిలుస్తారు. వాళ్లు భూమ్మీద నడపటం చాలా కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. భూమ్మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి, ఘర్షణ ప్రభావం వల్ల వ్యోమగాములు ఇక్కడ నడుస్తున్నప్పుడు ప్రతిబంధకం ఎదురవుతుంది. భూమ్మీదకు వచ్చిన అంతరిక్ష యాత్రికులు- పాదాల సమస్యతోపాటు ఎముకల సమస్యను కూడా ఎదుర్కొంటారు. వారి ఎముకల సాంద్రత తగ్గుతుంది. అంతేగాదు, వారి శరీరంలో రక్తం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..