
చెన్నై విమానాశ్రయంలో అరుదైన, అంతరించిపోతున్న వన్యప్రాణులను కస్టమ్స్ అధికారులు రక్షించారు. మలేషియాలోని కౌలాలంపుర్ నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు స్మగ్లర్లను పట్టుకోగా, వారి ట్రాలీ బ్యాగ్లో ఎఈస్టర్న్ గ్రే గిబ్బన్స్, మిల్స్ స్టోన్ పోల్క్యాట్స్ ఉన్నాయి. వాటిలో రెండు ప్రాణాలు కోల్పోయాయి.
విదేశాల నుంచి భారత్కు వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. మలేషియా ఎయిర్లైన్స్ విమానంలో చెన్నై చేరుకున్న ఇద్దరు ప్రయాణికులను మార్చి 7న అడ్డగించారు. చెక్-ఇన్ లగేజీలో వెంటిలేటెడ్ పెట్టెల్లో 8 అరుదైన జంతువులను దాచినట్లు గుర్తించారు. వైల్డ్లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (WCCB) అధికారులు విమానాశ్రయానికి చేరుకుని అరుదైన జంతువుల శాస్త్రీయ పేర్లతో జాతులను గుర్తించారు. చనిపోయిన జంతువులను సురక్షితంగా దహనం చేశారు. మిగిలిన వాటిని మలేషియాకు తిరిగి పంపించేశారు.
వన్యప్రాణులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై కస్టమ్స్ యాక్ట్, 1962 సెక్షన్ 110; వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అలందూర్ కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మలేషియా మరియు థాయిలాండ్ వంటి దేశాలకు సమీపంలో ఉండటం వల్ల చెన్నై ఒకప్పుడు అక్రమ పెంపుడు జంతువుల వ్యాపారానికి కేంద్రంగా మారింది. ఇటీవల చెన్నైలో తనిఖీలను తీవ్రతరం చేయడంతో స్మగ్లర్లు వివిధ విమానాశ్రయాల ద్వారా వన్యప్రాణులను దేశంలోకి తీసుకురావడం ప్రారంభించారు. చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఇటీవల మలేషియా నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి నుండి ఆరు బ్లాక్-కాలర్ స్టార్లింగ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిఘాను కఠినతరం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..