
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వాహన ఆధారిత నేరాలను తగ్గించేందుకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇకపై రోడ్డుపైకి వచ్చే ఏ వాహనానికైనా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కచ్చితంగా ఉండాల్సిందే అంటోంది తెలంగాణ రవాణా శాఖ. సెప్టెంబర్ 30లోపు అందరూ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ను అమర్చుకోవాలని సూచిస్తోంది.
HSRPకి మారకపోతే కేసులు బుక్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కోసం రవాణాశాఖ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం కేటాయించిన సమయానికి వెళ్లి నెంబర్ ప్లేట్ మార్చుకోవాలని చెబుతున్నారు అధికారులు. ఒకవేళ సెప్టెంబర్ 30లోపు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్కి మారకపోతే కేసులు బుక్ చేయడమే కాకుండా.. వాహనాన్ని కూడా సీజ్ చేస్తామని హెచ్చరిస్తోంది రవాణాశాఖ. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకపోతే ఆయా వాహనాలకు బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబోరంటున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
HSRP ఎలా బుక్ చేసుకోవాలి?
వాహన యజమానులు www.siam.in వెబ్సైట్ ద్వారా తమ వాహనానికి అనుకూలమైన తయారీదారుని ఎంచుకుని, ఆన్లైన్లో HSRP ఆర్డర్ చేయవచ్చు. వాహన వివరాలు నమోదు చేసి, చెల్లింపు చేసిన తర్వాత డీలర్ ద్వారా ప్లేట్ ఫిట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్లేట్ అమర్చిన తర్వాత ఫోటోను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అంతేకాదు, హోలోగ్రామ్ స్టిక్కర్ కూడా తప్పనిసరిగా వాహనంపై ఉండాలి.
ఇన్సూరెన్స్, పొల్యూషన్ టెస్ట్ తప్పనిసరి
ఇకపై వాహనానికి HSRP ప్లేట్ లేకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ జారీ చేయవు. అదే విధంగా పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్లు కూడా HSRP లేకుండా సర్టిఫికెట్ ఇవ్వకూడదని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, వాహన డీలర్లు ఖచ్చితమైన ధరలతోనే సేవలు అందించాలి. HSRP ధరల వివరాలను షోరూమ్లో బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలి. కాగా, 2 వీలర్లకు సగటు ధర రూ. 320 – 380, 4 వీలర్లకు రూ. 590 – 700గా ప్రభుత్వం అంచనా వేసింది.
నకిలీ నంబర్ ప్లేట్లు వాడితే జరిమానాలు
వాహనంపై ‘IND’ మార్కుతో ఉన్నా కానీ అసలు HSRP కాకపోతే, లేదా నకిలీ నెంబర్ ప్లేట్ ఉంటే, వాటిని మార్చి అసలు HSRP ప్లేట్ అమర్చించాల్సిందే. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర రవాణా శాఖ అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. రవాణా కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..