
కొన్ని సార్లు అస్సలు ఊహించని రీతిలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలా కూడా జరుగుతుందా అన్ని ప్రమాదం జరిగిన తర్వాత షాక్ అయ్యే రీతిలో ఉంటాయి. తాజాగా అలాంటి ప్రమాదం ఒకటి రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని 17వ పోలీస్ బెటాలియన్ కు చెందిన కమాండెంట్ తోట గంగారాం(58) జిల్లా కేంద్రంలోని ఒక అపార్ట్ మెంట్ లో అర్ధ రాత్రి డిన్నర్ చేసిన తర్వాత లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ రాకముందే లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో ఆయన కిందపడి, లిఫ్ట్ బెస్మెంట్లోకి వెళ్లి పడ్డారు.
గమనించిన అపార్ట్మెంట్ వాసులు ఆయనను అందులోంచి బయటికి తీసి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చాలా ఎత్తు నుంచి ఆయన బెస్మెంట్లో పడటంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోందు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య రేఖ, ఒక కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. గంగారం సొంత ఊరు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామంగా పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.