

పాకిస్తాన్లోని జీలం వద్ద జరిగిన కాల్పుల్లో ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ గాయపడ్డాడు. అతన్ని రావల్పిండిలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చారు. పాకిస్తాన్ ఆర్మీ కార్ప్స్ కమాండర్ను కలిసిన తర్వాత సయీద్ తిరిగి వస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సయీద్ మేనల్లుడు అబూ ఖతల్ ప్రాణాలు కోల్పోయాడు. నిజానికి, అబూ ఖతల్తో పాటు హఫీజ్ సయీద్ కూడా ప్రాణాలు కోల్పోయాడని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. హఫీజ్ సయీద్ ఇంకా బతికే ఉన్నాడు. కాల్పుల్లో గాయపడిన హఫీజ్ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ సహచరుడు అబూ ఖతల్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు ఆయనను కాల్చి చంపారు. అబూ ఖతల్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో ముఖ్యమైన సభ్యుడు. అతన్ని లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కుడిభుజంగా పిలుస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ దాడిలో హఫీజ్ సయీద్ బయటపడ్డాడు.
అబూ ఖతల్ ఎవరు?
జమ్మూ కాశ్మీర్ ప్రజలలో భారతదేశంపై ద్వేషాన్ని సృష్టించడమే లష్కరే తోయిబా ఉగ్రవాది నదీమ్ అలియాస్ అబూ ఖతల్ సింఘి పని. జమ్మూ కాశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు అతను ప్రధాన సూత్రధారి. 2023లో జరిగిన రాజౌరి ఉగ్రవాద దాడిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో ఆయనపై ఎన్ఐఏ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. 2024 జూన్ 9న జమ్మూ కాశ్మీర్లోని శివ్ ఖోడి నుండి కాట్రాకు వెళ్తున్న బస్సుపై జరిగిన ఉగ్రవాద దాడిలో కూడా అబూ ఖతల్ పేరు తెరపైకి వచ్చింది. ఈ దాడిలో ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపారు. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు.
గత కొంత కాలంగా పాకిస్తాన్ లో భారతదేశ శత్రువులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. అన్ని దాడులు ఒకే విధంగా జరుగుతున్నాయి. గుర్తు తెలియని దుండగులు పాకిస్తానీ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా హఫీజ్ సయీద్ అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మోస్ట్ వాంటెడ్ టెర్రిరిస్ట్ హఫీజ్ సయీద్
అబూ ఖతల్ తన మేనమామ హఫీజ్ సయీద్ ఆదేశాల మేరకు అన్ని ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేవాడు. ముంబైలో జరిగిన 26/11 దాడికి హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. అతను భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడికి హఫీజ్ సయీద్ను ప్రధాన సూత్రధారిగా భావిస్తారు. ఈ దాడిలో 160 మందికి పైగా మరణించారు. 2006 ముంబై రైలు పేలుళ్లలో హఫీజ్ సయీద్ పాత్ర ఉంది. 2001లో సయీద్ భారత పార్లమెంటును కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. అతను NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ముంబై దాడుల తర్వాత, అతన్ని అప్పగించాలని భారతదేశం పాకిస్తాన్ను కోరింది. కానీ పాకిస్తాన్ అతన్ని ఉగ్రవాదిగా అంగీకరించడానికి నిరాకరిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..