
ఉత్తరప్రదేశ్కు చెందిన మాజీ ఎమ్మెల్యే, పూర్వాంచల్ ముఖ్యనేత వినయ్ శంకర్ తివారీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. బ్యాంకులకు దాదాపు రూ. 754 కోట్ల నష్టం వాటిల్లిన ఒక పెద్ద బ్యాంకు కుంభకోణానికి సంబంధించి కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
మెస్సర్స్ గంగోత్రి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు, హామీదారులతో కలిసి బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియం నుండి రూ.1,129.44 కోట్ల రుణ సౌకర్యాన్ని పొందిందని ED దర్యాప్తులో వెల్లడైంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీకి చెందిన రూ.72.08 కోట్ల విలువైన ఆస్తులను ED నవంబర్ 2023లో జప్తు చేసింది. కానీ ఈ డబ్బును వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా, దానిని ఇతర కంపెనీలకు మళ్లించారు. తరువాత బ్యాంకులు డబ్బు తిరిగి అడిగినప్పుడు, ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీని కారణంగా బ్యాంకులకు రూ.754.24 కోట్ల భారీ నష్టం వాటిల్లింది.
గంగోత్రి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు సంబంధించిన పత్రాలు, బ్యాంకు రికార్డులను పరిశీలించిన తర్వాత, రుణాన్ని దుర్వినియోగం చేశారని, కంపెనీల మధ్య డబ్బును బదిలీ చేయడం ద్వారా మోసం జరిగిందని ED గుర్తించింంది. ఈ కేసులో విచారణలో భాగంగా సోమవారం(ఏప్రిల్ 7) ఈడీ మాజీ ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీకి చెందిన పలు ప్రదేశాలపై దాడులు నిర్వహించింది. ఇంతలో, ED బృందం సుదీర్ఘ విచారణ తర్వాత వినయ్ శంకర్ తివారీని అరెస్టు చేసింది.
వినయ్ శంకర్ తివారీ మాజీ మంత్రి, పూర్వాంచల్ ప్రముఖ నాయకుడు హరిశంకర్ తివారీ కుమారుడు. పూర్వాంచల్లో తివారీ కుటుంబం పేరు చాలా కాలంగా రాజకీయాలు, అధికార కేంద్రంగా ఉంది. వినయ్ శంకర్ గోరఖ్పూర్ జిల్లాలోని చిల్లుపర్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి.
ఈడీ చర్య తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. కొన్ని రాజకీయ పార్టీలు ఇది ప్రతీకార భావనకు సంబంధించినదని చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం చట్టం అందరికీ ఒకటేనని, ప్రజలను లేదా బ్యాంకులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతోంది. ప్రస్తుతం వినయ్ శంకర్ తివారీని కోర్టులో హాజరుపరుస్తారు. ED అతన్ని రిమాండ్కు తీసుకుని మరింత దర్యాప్తు చేయవచ్చు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..