
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని అఖోరా ఖట్టక్లోని దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సాలో శుక్రవారం(ఫిబ్రవరి 28) ప్రార్థనల సందర్భంగా జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 16 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ దాడిలో జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం-సమీ (జెయుఐ-ఎస్) చీఫ్ మౌలానా హమీదుల్ హక్ హక్కానీ కూడా మరణించారు. అతను JUI-S మాజీ చీఫ్ మరియు ‘తాలిబన్ పితామహుడు’ మౌలానా సమియుల్ హక్ హక్కానీ కుమారుడు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, మౌలానా హమీదుల్ హక్ హక్కానీ ప్రార్థనల సమయంలో మసీదులోని మొదటి వరుసలో ఉన్నాడు. మౌలానా హమీదుల్ హక్ టార్గెట్గా ఈ దాడి జరిగినట్లు కనిపిస్తోందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) జుల్ఫికర్ హమీద్ ఇది ఆత్మాహుతి దాడి అని, మౌలానా హమీదుల్ హక్ ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన ధృవీకరించారు. ఈ విషయంపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని, పేలుడు వెనుక గల కారణాలను తెలుసుకుంటున్నామని ఆయన స్థానిక మీడియాకు తెలిపారు. దారుల్ ఉలూమ్ హక్కానియా మదర్సా రాడికల్ ఇస్లామిక్ భావజాలానికి నూరిపోస్తుంది. తాలిబాన్ నాయకులకు ప్రధాన విద్యా కేంద్రంగా పని చేస్తోంది. ఈ దాడి తర్వాత, మొత్తం ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఖైబర్ పఖ్తుంఖ్వా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు.
#Pakistan : Suicide blast during Friday prayers at Darul Uloom Haqqania, Akora Khattak. JUI-S chief Maulana Hamid-ul-Haq among the injured. Over 10 casualties reported. This madrassa is significant as it has produced top Taliban leaders, including Mullah Omar and Sirajuddin… pic.twitter.com/sc0Mfe524g
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) February 28, 2025
మౌలానా హమీదుల్ హక్ హక్కానీ ఎవరు?
మౌలానా హమీదుల్ హక్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. 2018లో తన తండ్రి మౌలానా సమియుల్ హక్ హత్య తర్వాత ఆయన జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం-సామి (JUI-S) అధిపతి అయ్యాడు. అతని తండ్రి, మౌలానా సమియుల్ హక్, తాలిబాన్ పితామహుడిగా భావిస్తారు. ఆఫ్ఘన్ తాలిబాన్కు గట్టి మద్దతుదారు.
1947లో స్థాపించిన దారుల్ ఉలూమ్ హక్కానియా పాకిస్తాన్లోని అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిక్ మదర్సాలలో ఒకటి. దీనిని మౌలానా సమియుల్ హక్ తండ్రి మౌలానా అబ్దుల్ హక్ హక్కానీ స్థాపించారు. అయితే, ఈ మదర్సా చరిత్ర వివాదాలతో నిండి ఉంది. 2007లో పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో కొంతమంది అనుమానితులకు ఈ మదర్సాతో సంబంధాలు ఉన్నాయి. అయితే మదర్సా నిర్వాహకులు మాత్రం అలాంటి ఆరోపణలను ఖండించింది.
బిబిసి కథనం ప్రకారం, ఈ మదర్సా పూర్వ విద్యార్థులు ఆఫ్ఘన్ తాలిబన్ అగ్ర నాయకత్వంలో చేరారు. వీరిలో తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి, అబ్దుల్ లతీఫ్ మన్సూర్, అపఖ్యాతి పాలైన హక్కానీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు ముల్లా జలాలుద్దీన్ హక్కానీ, గ్వాంటనామో బే మాజీ ఖైదీ ఖైరుల్లా ఖైరుఖ్వా వంటి వారు ఉన్నారు. దారుల్ ఉలూమ్ హక్కానియా చాలా కాలంగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాలు, రాడికల్ గ్రూపులు, భద్రతా సంస్థల మధ్య చర్చనీయాంశంగా ఉంది. మౌలానా హమీదుల్ హక్ మరణం తరువాత, ఈ సంస్థ మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..