
ఉత్తరప్రదేశ్ మథురలోని సున్ రాఖ్ గ్రామానికి చెందిన రాజా బాబు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లినా ఆ నొప్పి తగ్గలేదు. తనకు తానే స్వయంగా ఆపరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూశాడు. ఆపరేషన్ కోసం మథురకు వెళ్లి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసుకునే పరికరాలు, మత్తు ఇంజెక్షన్లు తెచ్చుకున్నాడు. బుధవారం రాజబాబు ఒక గదిలో సర్జరీకి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆపరేషన్ ప్రారంభించే ముందు తనకు తాను మత్తు ఇంజెక్షన్ చేసుకున్నాడు. ఆ తర్వాత కడుపు కుడివైపున 7 అంగుళాల గాటు పెట్టాడు. అది అనుకున్నదాని కంటే ఎక్కువ గాటు పడి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో అలర్టయి సూది, దారంతో కుట్లు వేసుకునేందుకు ప్రయత్నించాడు. కొంత సమయం తర్వాత మత్తు ఇంజెక్షన్ ప్రభావం తగ్గిపోయి నొప్పి మరింత పెరిగింది. ఇంకా రక్తస్రావం కూడా ఆగకపోవడం వల్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు, రాజ బాబును మథుర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.