
బీహార్లో ఏప్రిల్ 24న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సీఎం అభ్యర్ధిగా నితీష్ కుమార్ పేరు ప్రకటిస్తారా? లేక సస్పెన్స్ కొనసాగిస్తారా? నితీష్ రాజకీయ జీవితం ముగిసిందని విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో మోదీ ఏం చెబుతారన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ఇప్పటికే బీహార్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఏప్రిల్ 24న బీహార్కు వస్తున్నారు. మధుబనిలోని భౌదాగరి వద్ద ఉన్న విమానాశ్రయంలో కొత్త టెర్మినల్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు, అనేక ముఖ్య పథకాలను ప్రకటించనున్నారు. దాదాపు 2 నెలల్లో ప్రధాని మోదీ బీహార్లో పర్యటించడం ఇది రెండవసారి.
బీహార్లో మరోసారి ఎన్డీఏ కూటమి గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే తమిళనాడులో పళనిస్వామి నేతృత్వం లోనే ఎన్నికల్లో పోటీ చేస్తామన్న బీజేపీ నాయకత్వం బీహార్ విషయంలో ఎలాంటి ప్రకటన చేస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జేడీయూ నేత నితీష్ కుమార్ను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తారా? లేక ఎన్నికల తరువాతే సీఎంని నిర్ణయిస్తామని అంటారా? ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏప్రిల్ 24న ప్రధాని మోదీ బీహార్లో పర్యటిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. రాహుల్ డైరెక్షన్ను బీహార్ కాంగ్రెస్ కూడా పోరుబాట పట్టింది. నిరుద్యోగులకు న్యాయం పేరుతో భారీ ఆందోళనలు చేపట్టింది. దీంతో విపక్షాలకు మోదీ ఎలా కౌంటర్ ఇస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.
అయితే మోదీ బీహార్ పర్యటనలో సీఎం అభ్యర్ధిపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతోంది. మోదీ పర్యటనపై ఏర్పాట్ల కోసం ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం పాట్నాలో జరిగింది. నితీష్ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. వికసిత్ బీహార్ ఎన్డీఏ తోనే సాధ్యమన్నారు. యువతకు ఉద్యోగాల విషయంలో విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నితీష్కుమార్ ఐదేళ్లలో 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నితీష్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతోంది. ఎన్డీఏ పాలనలో బీహార్ దూసుకెళ్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించామని సామ్రాట్ చౌదరి తెలిపారు. 2030లో వికసిత్ బీహార్ లక్ష్యంగా ఎన్డీఏనే గెలిపించాలని ఆయన అన్నారు.
బీహార్ ఎన్డీఏ కూటమి సమావేశానికి బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కీలక నేతలు హాజరయ్యారు. మధుబనిలో మోదీ మీటింగ్ను సక్సెస్ చేస్తామన్నారు ఎంపీ శాంభవి చౌదరి. ప్రధాని తొలిసారి బీహార్కు రావడం లేదు. బీహార్కు ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో భాగల్పూరు వచ్చారు. ఇప్పుడు మధుబని వస్తున్నారు. ఆయన సభను సక్సెస్ చేయడానికి ఎన్డీఏ పార్టీల సమావేశం జరిగిందని ఎంపీ శాంభవి చౌదరి స్పష్టం చేశారు.
మధబనిలో జరిగే కార్యక్రమంలో దాదాపు ఐదు లక్షల మంది పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ పేర్కొన్నారు. మధుబని మాత్రమే కాకుండా, సుపాల్, సీతామర్హి, సహర్సా, మాధేపురా, సమస్తిపూర్, శివర్, దర్భంగా, అరారియా మరియు ముజఫర్పూర్ నుండి కార్యకర్తలు, నాయకులు హాజరవుతారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ 10 జిల్లాల పంచాయతీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఏప్రిల్ 24న ప్రధాని మోదీ మధుబని పర్యటనకు ముందు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బీహార్ కు వస్తున్నారు. మధుబనిలో జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పాట్నాలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి ఎన్డీఏ బీహార్ అధ్యక్షులతో పాటు 10 జిల్లాలకు చెందిన ఎన్డీఏ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమయంలో, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి లల్లన్ సింగ్ కూడా ఆయనతో సమావేశంలో పాల్గొనవచ్చు.
ఎన్నికల ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సమావేశం తర్వాత, శివరాజ్ సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మధుబని సీనియర్ అధికారులతో మాట్లాడతారు. ప్రధానమంత్రి కార్యక్రమం కోసం మధుబనిలో ఎలాంటి అధికార సన్నాహాలు జరిగాయో ఆయన సమీక్షిస్తారు. మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..