
మీరు వంటకాలలో వాడే లవంగాలు రుచికే కాదు.. దోమలను తరిమివేయడానికి కూడా ఉపయోగపడతాయన్న సంగతి తెలుసా..? వాటిలో ఉండే శక్తివంతమైన వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. అలాగే పసుపు ఆరోగ్యానికి మంచిదే కాకుండా చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటినీ కిరోసిన్ తో కలిపి ఒక చిన్న దీపం వెలిగిస్తే ఇంట్లోకి వచ్చే దోమలు, ఈగలు పారిపోతాయి.
ఎలా తయారు చేయాలి..?
ముందుగా చిన్న మోతాదులో లవంగాలను తీసుకుని రోలులో లేదా పేస్ట్ రుబ్బే పాత్రలో కొద్దిగా నలిపి పొడిగా చేయండి. దీనికి మిక్సీ అవసరం లేదు రోలు సరిపోతుంది. ఆ తరువాత ఒక దీపాన్ని తీసుకుని అందులో ఒక స్పూన్ కెరోసిన్ ఆయిల్ పోయండి. దానికి చిటికెడు లవంగాల పొడిని కలపండి. పైగా పావు స్పూన్ పసుపు పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దాదాపు గంట పాటు అలాగే ఉంచండి తద్వారా అన్ని పదార్థాలు బాగా కలిసిపోతాయి. ఆ తరువాత ఈ మిశ్రమంలో వత్తి పెట్టి దీపాన్ని వెలిగించండి. దీని ద్వారా వెలువడే పొగ దోమలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
ఉపయోగం ఏంటి..?
ఈ దీపం వెలిగించినప్పుడు వచ్చే వాసన దోమలకు నచ్చదు. వాసన వచ్చే పరిసరాలలోకి అవి రావడం తగ్గిపోతుంది. దీని వల్ల ఇంట్లో వాతావరణం స్వచ్ఛంగా, ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లకు ఇది సురక్షితమైన మార్గం.
తక్కువ ఖర్చే
ఈ విధానం ద్వారా మీరు తక్కువ ఖర్చుతోనే ఇంట్లో ఒక సహజ వాతావరణాన్ని సృష్టించవచ్చు. కెమికల్స్ అవసరం లేదు. దీపం వెలిగినప్పుడు వచ్చే వాసన, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని కూడా తగ్గించడంలో సహకరిస్తుంది. ఇది ఒక రకంగా వాస్తు దోష నివారణ ప్రక్రియగా కూడా పరిగణించవచ్చు.
జాగ్రత్తలు
- దీపం వెలిగించే సమయంలో చిన్నపిల్లలు దగ్గరగా ఉండకుండా చూడండి.
- కిరోసిన్ వాడిన కారణంగా దీపం దహన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని స్థిరమైన ప్రదేశంలో మాత్రమే వెలిగించాలి.
- ఎక్కువ పొడి వేయకండి. తగినంత మాత్రమే ఉపయోగించండి.
ఈ విధంగా ఇంట్లోనే లభించే పదార్థాలతో కేవలం కొన్ని నిమిషాల్లో తయారయ్యే ఈ దీపం దోమల నుంచి విముక్తి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి హాని లేకుండా ఒక శుభ్రమైన పరిసరాన్ని కల్పిస్తుంది. రోజులో ఒక్కసారి దీపం వెలిగించడం ద్వారా మీరు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
