

గ్రీన్ కార్డ్ పొందినంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చని అనుకోవడం పొరపాటేనని, అమెరికాలో ఎవరు ఉండాలనేది నిర్ణయించేది తామేనని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనతో అమెరికాలో ఉంటున్న భారత సంతతి ప్రజల్లో గుబులు రేగుతోంది. అమెరికాలో ఉంటున్న భారత సంతతి గ్రీన్ కార్డ్ హోల్డర్లు, హెచ్ 1 బీ వీసాదారులు, ఎఫ్ 1 వీసాపై వెళ్లిన విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇమిగ్రేషన్ వ్యవహారాలు చూసే న్యాయవాదులు సూచిస్తున్నారు. అమెరికాలో నివసించేందుకు ప్రభుత్వం జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాలని, గ్రీన్ కార్డ్ గడువు ముగిసేంత వరకూ చూడకుండా ముందుగానే రెన్యువల్ చేయించుకోవాలని చెప్పారు. భారతదేశం జారీచేసిన పాస్ పోర్ట్, హెచ్ 1 బీ వీసాదారులైతే తాజా పే స్లిప్, విద్యార్థులైతే తమ కోర్సు కొనసాగే కాలానికి సంబంధించి కాలేజ్ లేదా యూనివర్సిటీ జారీ చేసిన అధికారిక ధ్రువపత్రం వెంట ఉంచుకోవాలని తెలిపారు. అదే సమయంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు కూడా భారత సంతతి అమెరికన్లకు, హెచ్ 1 బీ, ఎఫ్ 1 వీసాదారులకు అడ్వైజరీ జారీ చేశారు. చట్టాల్లో మార్పుల కారణంగా అదనపు తనిఖీలు తప్పవని, గంటల తరబడి తనిఖీలు కొనసాగినా ఓర్పు వహించాలని సూచించారు.