
దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో దావోస్లో పర్యటిస్తున్న మంత్రులు, అధికారుల బృందాలు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడి మరీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మోడ్రన్ టెక్నాలజీ యుగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై రెండు ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. దానిలో భాగంగా.. దావోస్ టూర్లో ఏఐ ఇన్వెస్టిమెంట్స్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంట్రోల్ ఎస్ సంస్థ ముందుకొచ్చింది. 10 వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్బాబు, కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ సమక్షంలో ఈ డీల్ జరిగింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో AI డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా, 3,600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు.
ఇదిలావుంటే.. టెక్నాలజీ విషయంలో దూకుడు ప్రదర్శించే సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏపీలో ఏఐ సేవల వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పెట్టుబడులు సాధనే లక్ష్యంగా దావోస్లో మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఏఐ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం దావోస్లో కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్ నిర్మాణం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా.. ఏపీ రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రిమోట్ సెన్సింగ్, ఏఐ సాంకేతికలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పబ్లిక్ హెల్త్ విభాగంలోనూ ఏఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సర్వీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వివిధ రకాల సవాళ్ల పరిష్కారంలో ఏఐ వినియోగం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు మంత్రి నారా లోకేష్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి