

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ స్నేహితుడి కోసం ఊరు ఊరంతా ఒక్కటైంది. ముప్పై ఏళ్ల క్రితమే ఊరు వదిలి వెళ్లిపోయినా.. ఊరి కోసం ఊరు బాగుకోసం తపించే ఆ దోస్త్ కోసం కులమతాలను పక్కన పెట్టి గ్రామమంతా ఏకమైంది. ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్నేహితుడు తమ మతం కాకపోయినా.. పరమత దర్మాన్ని నిష్టగా పాటించే ఆ స్నేహితుని ప్రాణాలు నిలిపడమే లక్ష్యంగా యజ్ఞ కార్యానికి పూనుకుంది ఆ గ్రామం. దోస్త్ మేరా దోస్త్ నువ్వే మా ప్రాణం అంటూ నిష్టతో పూజలు చేస్తోంది. ఇంతకీ ఈ బృహత్తర కార్యం జరుగుతున్న ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
అడవుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంపూర్కు చెందిన షేక్ సలీం (60) 30 ఏళ్ల కిందటే కుటుంబ సభ్యులతో కలిసి బతుకు దెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లారు. అయినా ఊరును ఊరు క్షేమాన్ని మరువలేదు. అనారోగ్య సమస్యలతో హైదరబాద్ కు వెళ్లే గ్రామస్తులకు నేనున్నానంటూ అండగా నిలుస్తూ వచ్చాడు. తోచినంత సాయం చేసి మంచితనం చాటుకున్నారు. ఇప్పుడు ఆయనే అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు.
ఇన్నాళ్లు తమ బాగు కోరిన తమ మిత్రుడు ఆపదలో ఉన్నాడని తెలియగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. స్నేహితుడు తమ మతం కాకపోయినా పరమతాన్ని గౌరవించే షేక్ సలీం కోసం హిందువు మిత్రులంతా కలిసి యజ్ఞ కార్యానికి పూనుకున్నారు. దోస్త్ క్షేమంగా తిరిగి రావాలని ముక్కోటి దేవతలకు హోమం నిర్వహించారు శ్యాంపూర్కు చెందిన సలీం మిత్రులు. మతసామరస్యాన్ని పాటించి మిత్రుడి ఫ్లెక్సీతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు.
దశాబ్దాల కిందటే గ్రామాన్ని విడిచి వెళ్లినా.. సొంతూరిపై అభిమానాన్ని అతను వదులుకోలేని తమ మిత్రుడు సలీం కోసం ఈ మాత్రం చేయక పోతే ఎలా అన్నది ఆ గ్రామస్తుల మాట. ప్రస్తుతం సలీం హైదరబాద్ కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేస్తున్నారు. గ్రామం నుంచి హైదరాబాద్కు ఎవరు వెళ్లినా తమ ఇంట్లోనే బస, భోజనం ఏర్పాటు చేస్తు వచ్చారు. ముఖ్యంగా అనారోగ్యంతో వచ్చే శ్యాంపూర్ వాసులను సలీం తమ ఇంట్లోనే ఉంచుకుని, అన్నీ తానై సాయం చేస్తూ.. వచ్చారు. అటువంటి సలీంను ఇలా ఆపదలో ఒంటరిగా వదిలేస్తామా అని చెప్తున్నారు శ్యాం పూర్ వాసులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..