
ఓ యువకుడు తండ్రి మృతదేహం ముందే ప్రేమించిన యువతిని పెళ్లాడాడు. ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఇలా చేశాడు. ఈ ఘటన తమిళనాడు కడలూర్ జిల్లాలో జరిగింది. కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్ రైల్వేలో పని చేసి రిటైరయ్యారు. ఆయన రెండవ తనయుడు అప్పు… విరుధాచలం కౌంజియప్పర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్న విజయశాంతితొో ప్రేమలో ఉన్నారు. కెరీర్లో సెటిల్ అయ్యాక ఇరు కుటుంబాల సమ్మతితో మనువాడలనుకన్నారు. అయితే అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతిక రూపం కనుమరుగు అయ్యే ముందే దీవెనలు పొందాలనే ఉద్దేశంతో ప్రేయసి విజయశాంతిని ఒప్పించి తండ్రి మృతదేహం ఎదుట ఆమెకు అప్పు తాళి కట్టారు. తీవ్ర దుఃఖంలోను అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు వారిని చల్లగా ఉండాలని ధీవించారు. అమ్మాయి తరుఫు నుంచి ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో అంతిమయాత్రకు ముందే ఇలా పెళ్లి చేసుకున్నట్లు అప్పు చెబుతున్నాడు. ప్రియుడి పరిస్థితిని అర్థం చేసుకుని.. అతని మనస్సు గ్రహించి.. ప్రేమించిన అప్పుతో ఆ సమయంలో పెళ్లికి అంగీకరించిన విజయశాంతిది గొప్ప మనసు అని అందరూ కొనియాడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..