
కాశ్మీర్ను భూలోక స్వర్గంగా కీర్తిస్తాం. ఎత్తైన హిమగిరుల మధ్య కొలువైన అందమైన లోయలో కాశ్మీర్ విస్తరించి ఉంది. అక్కడ ఎటు చూసినా అందమైన దృశ్యాలే కనువిందు చేస్తాయి. అందుకే దేశ విదేశాల నుంచి యాత్రికులు ఆ లోయను సందర్శిస్తుంటారు. లోయలో యాత్రికులను అమితంగా ఆకట్టుకునే ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత సుందరమైన స్విట్జర్లాండ్ను తలపించేలా ఉన్న అలాంటి ప్రాంతాల్లో ‘పహల్గాం’ ఒకటి. మినీ స్విట్జర్లాండ్గా ఈ ప్రాంతం పేరు పొందింది. చుట్టూ పచ్చని పచ్చిక బయళ్లు, దట్టంగా అలుముకున్న వృక్ష సంపద, ఆపై చుట్టూ వెండి కొండల మాదిరిగా కానవచ్చే హిమగిరులు.. ఎంతో అందమైన ఆ ప్రదేశం సర్వకాలాల్లోనూ పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
పహల్గాం కేవలం టూరిస్టులను మాత్రమే కాదు, ఆధ్యాత్మిక యాత్రికులకు కూడా స్వర్గధామం. హిందూమతంలో అత్యంత క్లిష్టమైన తీర్థయాత్రల్లో అమర్నాథ్ యాత్ర ఒకటి. ఏడాదిలో కొద్ది రోజుల పాటు మాత్రమే ‘మంచు లింగం’ రూపంలో దర్శనమిచ్చే ఆ పరమేశ్వరుడిని దర్శించుకోడానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అమర్నాథ్ గుహను చేరుకునే మార్గాల్లో పహల్గాం మార్గమే ప్రధానమైనది. గుహకు మరోవైపు సోనామార్గ్ – బాల్తాల్ వైపు నుంచి మార్గం ఉన్నప్పటికీ.. అది నిట్టనిలువుగా ట్రెక్కింగ్ చేయాల్సిన క్లిష్టతరమైన మార్గం కావడంతో యాత్రికుల్లో ఎక్కువ మంది పహల్గాం మార్గాన్నే ఎంచుకుంటారు. ఇక్కణ్ణుంచి యాత్రను ప్రారంభించి రెండు రోజుల పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ అమర్నాథ్ గుహను చేరుకుంటారు. అందుకే పహల్గాం దేశంలో అందరికీ పరిచయం అవసరం లేని ప్రాంతంగా మారింది.
ఇటు సాధారణ పర్యాటకులతో పాటు, అటు తీర్థయాత్రికులను సైతం ఆకట్టుకునే ప్రత్యేక లక్షణం పహల్గాం సొంతం. ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. అయితే దేశమంతటా వేసవి వేడితో సతమతమవుతున్న వేళ, చల్లని కాశ్మీర్ లోయ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. అందులో స్విట్జర్లాండ్ను తలపించే పహల్గాం, సోనామార్గ్, గుల్మార్గ్తో పాటు రాజధాని శ్రీనగర్కు పెద్ద సంఖ్యలో టూరిస్టులు పోటెత్తుతున్నారు. ఇదే ఉగ్రవాదులు టార్గెట్ చేయడానికి వీలు కల్పించింది.
ఉగ్రవాదుల హిట్లిస్టులో యాత్రికులు
————————–
కాశ్మీర్ లోయలో స్థానికులకు ఎక్కువ ఉపాధి పర్యాటకం ద్వారానే లభిస్తుంది. అందుకే ఇక్కడ వేర్పాటువాద ఉగ్రవాదులు పర్యాటకులను సాధారణంగా టార్గెట్ చేయరు. ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినా.. వారి టార్గెట్ ఎప్పుడూ భారత సైనిక బలగాలు, భద్రతాదళాలే. వారి హిట్లిస్టులో ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ (RR) యూనిట్లు, CRPF, ITBP, BSF వంటి కేంద్ర పారామిలటరీ బలగాల బెటాలియన్ క్యాంపులు వంటివి ఉంటాయి. ఉగ్రవాదులతో నిత్యం జరిగే సంఘర్షణలో అనేక మంది సైనికులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. ఎన్కౌంటర్లలో అనేక మంది ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు అంతం చేస్తున్నాయి. కానీ అప్పుడప్పుడూ ఉగ్రవాదుల లక్ష్యం మారుతూ ఉంటుంది. చివరిసారిగా 2016లో అమర్నాథ్ యాత్ర జరుగుతున్న సమయంలో యాత్రికుల బస్సును లక్ష్యంగా కాల్పులు జరిపారు. మళ్లీ దాదాపు దశాబ్దకాలం తర్వాత పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రమూక విరుచుకుపడింది. ఈసారి ఉగ్రవాదులు పర్యాటకుల ఐడెంటిటీ గుర్తించి మరీ కాల్చి చంపినట్టు క్షతగాత్రులు వెల్లడించారు.
పక్కా పథకం ప్రకారమే దాడి
———————
పహల్గాం ఉగ్రదాడి పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఉగ్రవాదుల నెట్వర్క్ పర్యాటక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించింది. శ్రీనగర్తో పాటు గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గాం ప్రాంతాల్లో రిసార్టులు, హోటళ్లు, సమ్మర్ క్యాంపులను నిశితంగా గమనించారు. ఆయా ప్రాంతాల్లో యాత్రికుల రద్దీ ఏమేరకు ఉందో తెలుసుకున్నారు. సరిగ్గా అదను చూసి విరుచుకుపడ్డారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్న సమయం, భారత ప్రధాని సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన సమయం చూసి మరీ ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. తద్వారా కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చించాలన్నదే ఉగ్రవాదుల పన్నాగం. అయితే అమెరికా, రష్యా సహా అగ్రరాజ్యాలు, అనేక దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వానికి మద్దతును ప్రకటించాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని దాదాపు అందరికీ అర్థమైంది. దీంతో తదుపరి భారత్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.