కోల్కతా ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాల విషయంలో బెంగాల్ సీఎం మమతకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై మమతతో పాటు బెంగాల్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విధుల్లో జోక్యం చేసుకోవడం చాలా సీరియస్ వ్యవహారమని , దీనిపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు నోటీసుల్లో పేర్కొంది. ఐప్యాక్ సంస్థలో సోదాల సీసీటీవీ దృశ్యాలను భద్రపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈడీ అధికారులపై కోల్కతా పోలీసులు దాఖలు చేసిన మూడు ఎఫ్ఐఆర్లపై తదుపరి విచారణ వరకు స్టే విధించింది.
బెంగాల్ డీజీపీని సస్పెండ్ చేయాలన్న ఈడీ పిటిషన్పై కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మమత తరపున సింఘ్వి, కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తుంటే, ED తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కౌంటర్లు ఇచ్చారు. మమత ప్రభుత్వంపై ED తీవ్ర ఆరోపణలు చేసింది. ED అధికారుల ఫోన్లను మమత లాక్కున్నారని తుషార్ మెహతా ఆరోపించారు.కీలక ఆధారాలను దొంగిలించారంటూ ఏకంగా బెంగాల్ CMపైనే సంచలన కామెంట్స్ చేశారు. కలకత్తా హైకోర్టులో తమ లాయర్ల మైక్లను మ్యూట్ చేశారని తుషార్ మెహతా కోర్టుదృష్టికి తెచ్చారు. హైకోర్టులో తమ లాయర్ వాదనలు వినిపించడానికి అనుమతించలేదన్నారు. అయితే కలకత్తా హైకోర్టులో జరిగిన పరిణామాలపై కలత చెందామని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంలోనే ED వాదనలకు మమత తరపు లాయర్లు గట్టి కౌంటర్ ఇచ్చారు. మమత కేవలం 15 నిమిషాలే ఐప్యాక్ ఆఫీస్లో ఉన్నారని వాదించారు. ED చర్యలు దురుద్దేశపూరితంగా ఉన్నాయని మమత తరపు లాయర్లు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ED దాడులు ఎందుకు చేసిందని నిలదీశారు. ఐప్యాక్ ఆఫీస్లో ఎన్నికల మెటీరియల్ ఉందని అందరికీ తెలుసన్నారు . రహస్య సమాచారాన్ని ED లీక్ చేయకూడదని మమతా బెనర్జీ తరపు లాయర్ అన్నారు. లాయర్లు ప్రెస్కాన్ఫరెన్స్లు పెట్టడాన్ని సుప్రీం నిషేధించాలని ED తరపు లాయర్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
